ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు సినిమా రంగం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే కుప్పలు తెప్పలుగా తెలుగు సినిమా రంగం నుండి అనేకమంది వచ్చి కలుస్తారు. అభినందిస్తారు. చంద్రబాబు నాయుడు కోసం సినిమా రంగం నుండి చాలా మంది ఎన్నికల ప్రచారం చేస్తారు. అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం పాటలు, స్వల్ప నిడివి చిత్రాలు, తీసి తమ స్వామి భక్తిని చాటుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఒకరిద్దరు మినహా ఎవరూ వచ్చి ఆయనను కలవలేదు, అభినందించలేదు.
సినిమా రంగంపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టడంతో తెలుగు చిత్ర సీమ ఖంగుతింది. వందలు, వేల రూపాయలు టిక్కెట్లపై పెంచి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వానికి నామమాత్రం పన్నులు చెల్లిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి టికెట్ ధరలపై, టికెట్ విక్రయాలపై నిబంధనలు విధించారు. దీంతో దిమ్మతిరిగిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు గత తొమ్మిది నెలలుగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వచ్చింది. కొందరు సినీ ప్రముఖులు రాష్ట్ర మంత్రి పేర్ని నానిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా జనవరి నెలలో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత ఈ రోజు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, అలీ వంటి వారిని వెంటబెట్టుకుని చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా టికెట్ ధరపై ముఖ్యమంత్రి కొంత వెసులుబాటు కల్పించారు. అలాగే సినిమాల ప్రదర్శనపై కూడా కొంత వెసులుబాటు కల్పించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ కు విస్తరించాల్సిన ఆవశ్యకత గురించి చిరంజీవి బృందానికి ముఖ్యమంత్రి తెలియజేశారు. విశాఖపట్నం సినిమా పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని, అక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి, ఇళ్ళు నిర్మించుకోడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ప్రాంతాలు సినిమా షూటింగులకు అనువుగా ఉంటాయని, షూటింగులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
మొత్తానికి తెలుగు సినిమా బృందం జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. చిరంజీవితో పాటు హీరోలు ప్రభాస్ మరియు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని, ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల చూపించిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి అయితే ముఖ్యమంత్రి స్పందించిన విధానానికి ముగ్దుణ్ణయ్యాను అన్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక అవగాహనకు ప్రతినిధి బృందం అబ్బురపడింది. బహుశా అందుకే ఈ బృందంలో ఆర్ నారాయణ మూర్తి ఉండాల్సి వచ్చింది. నారాయణమూర్తికి ప్రత్యేక గౌరవం కూడా లభించింది.