పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ. ప్రస్తుతం వీరిద్దరూ రవితేజతో ఖిలాడీ మూవీ తీసి ఈ నెల పదకొండున రిలీజ్ చేసేస్తున్నారు.ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో తమ నెక్ట్స్ పిక్చర్ పవన్ తోనే అని హింట్స్ ఇచ్చారు. అంతే కాదు .. ఆయన్ని కల్సాం .. ఆయన టెంటెటివ్ గా ఓకే చెప్పారు.. రమేష్ వర్మే ఆ మూవీని డైరెక్ట్ చేస్తాడు లాంటి విషయాలన్నీ మీడియాకు పథకం ప్రకారమే లీకయ్యాయి.దీంతో ఫిలిం సర్కిల్స్ వారు కాస్త ఖంగారు పడ్డారు.ఇప్పటికే పవన్ కమిట్ అయిన సినిమాలు నాలుగో ఐదో ఉన్నాయి. వాటి సంగతే ఎటూ తేలని సందర్భంలో … ఇప్పుడు ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారు.అయితే … పవన్ కమిట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే అని బలంగా నిర్మాతగారు వాదించడం చూసి సర్లే ఈ సినిమా పట్టాలెక్కినప్పుడు చూద్దాం అని సర్దుకుపోతున్నారు.లాస్ట్ ఎలక్షన్స్ లో తన పార్టీని గెలిపించుకోలేకపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత రోజుల్లో పాలిటిక్స్ నుంచీ సినిమాలవైపు టర్నింగ్ ఇచ్చుకున్నారు. వెంటనే వకీల్ సాబ్ చేసేశారు. అది ఫస్ట్ వేవ్ కీ సెకండ్ వేవ్ కీ మధ్య రిలీజై భారీ వసూళ్లు రాబట్టింది.
సరిగ్గా అదే సమయంలో చాలా మంది డైరక్టర్లు ప్రొడ్యూసర్లు పవన్ వైపు పరుగులు తీశారు.ఆయన ఎవరినీ కాదనలేదు. కథ తెచ్చుకోండి సినిమా చేద్దాం … అనే చెప్తూ వచ్చారు. అలా వెంటనే కథ తెచ్చుకోలేని వారు రీమేకులకు ప్రాధాన్యత ఇచ్చారు. రీమేక్ కు ఏ భాషైతే ఏం అని మళయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పయుమ్ కోషియుమ్ మూవీని రానాతో కల్సి భీమ్లానాయక్ గా తెరకెక్కించే ప్రయత్నం మొదలు పెట్టేశారు. పెట్టేయడం ఏమిటి వెంటనే బరిలోకి దిగి షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. పాటలు రిలీజ్ చేసేశారు జనం వావ్ అనేశారు.అయితే … ఏపీలో టిక్కెట్ల రేట్ల ఇష్యూ సెటిల్ అయ్యాక రిలీజ్ చేద్దామనే మూడ్ లోనూ నైట్ కర్ఫ్యూ నేపధ్యంలోనూ వాయిదా వేసి ఈ నెల్లో వదిలేయాలని డిసైడ్ అయ్యారు.మరో వైపు క్రిష్ హరిహరవీరమల్లు కు ఓకే చెప్పడమే కాదు కొద్ది రోజులు ఆ షూట్ లో పాల్గొన్నాడు కూడా. తర్వాత ఏమైందో తెలియదు … దాని మీద పవన్ అంత ఇంట్రస్ట్ గా లేడనే ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదనీ … పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూవీ కంప్లీట్ చేస్తాడనీ నిర్మాత దర్శకులు మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. మరో వైపు గబ్బర్ సింగ్ లాంటి కీలకమైన హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ మూవీ అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ . ఇది ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే తనను కల్సిన సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రపోజల్ కు సై అన్నాడు.ఇవన్నీ అలా ఉండగా … తమిళ్ సినిమా వినోదాయ శితం రీమేక్ గురించి ఆలోచనలూ చేస్తున్నారు. దాని డైరెక్టర్ సముద్రఖని. మరో వైపు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ అనౌన్స్ చేసి ఊరుకున్నారు. ఇక తనతొ అప్పట్లో ఖుషీ లాంటి సూపర్ డూపర్ హిట్ తీసిన ఎ.ఎమ్ రత్నం కూడా డేట్స్ ఇస్తానన్నారు పవన్.
కానీ ఇంత వరకూ భీమ్లా నాయక్ తర్వాత ఏ సినిమా చేస్తాడో క్లారిటీ లేదు. అందరూ డేట్స్ కోసం సీరియస్ గా ఎదురుచూపులు మాత్రం చూస్తున్నారు. ఎవరికి వారు తరువాత పవన్ వచ్చేది తమ సెట్ మీదకే అని కాన్పిడెన్స్ గా ఉన్నారు.పవన్ కు టైమ్ చాలా తక్కువ ఉంది అనేది వాస్తవం. 2024లో ఎన్నికలు … కనీసం ఆరునెల్లు ముందుగా అయినా ఆయన బరిలోకి దిగాల్సి ఉంటుంది. అంటే గట్టిగా ఏడాదిన్నరలోపే ఉంటుంది సమయం.మరి ఏడాదిన్నరలోపు … ఇన్ని ప్రాజెక్టులు ఎలా చేస్తారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. రెండు మూడేళ్లకు ఓ సినిమా చేసిన పవర్ స్టార్ ఇప్పుడు ఏడాదిన్నరలో దాదాపు అరడజను సినిమాలు లైన్లో పెట్టడం చూసి అవాక్కవుతున్నారు . వీటిలో భీమ్లానాయక్ తో పాటు మరో రెండు సినిమాలు మాత్రమే 24 లోపు ఉంటాయనీ … మిగిలినవన్నీ ఎన్నికల తర్వాతే అనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. మరి పవన్ మనసులో ఏముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే మరి